
మిడ్నాపూర్ : పసిగుడ్డుకు ప్రాణం పోసిన ఓ డాక్టర్ మరుక్షణంలోనే ప్రాణం విడిచిన ఘటన మిడ్నాపూర్ లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పటండా ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరిగింది. సోనాలి కులియా మజి అనే గర్భిణి పురిటి నొప్పులతో జనవరి 17 ఆసుపత్రిలో చేరగా ఉదయం 11 గంటలకు ఆమెకు పాప పుట్టింది. కానీ పాపలో ఎటువంటి చలనం లేకపోవటంతో అందరూ కంగారుపడ్డారు. దీంతో ఆ పసిగుడ్డును పాపను చేతుల్లోకి తీసుకున్న డాక్టర్ బిభాస్ ఖుటియా (48) వార్మర్లో ఉంచి చికిత్స అందించాడు. కాసేపటికే పాపలో చలనం వచ్చి కేర్ కేర్ మంటు ఏడ్చింది. హమ్మయ్య అంటు అందరు సంతోష పడుతున్న క్రమంలో ఖుటియా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
ఈ ఘటనతో ఖంగుతిన్న నర్స్ వెంటనే కోలుకుని వెంటనే స్ట్రెచర్ మీద దగ్గర్లోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించింది. కానీ అప్పటికే ఖుటియా మరణించారని డాక్టర్లు తెలిపారు. వృత్తి పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఖుటియా 15 ఏళ్లకుపైగా అదే ప్రాథమిక కేంద్రంలో డాక్టర్గా సేవలు అందించారు. ప్రసవాలు చేయడానికి వీలుగా ఆయనే స్వయంగా ఆ హాస్పిటల్లో ఓ గదిని ఏర్పాటు చేశారు. పెళ్లి కూడా చేసుకోని ఆయన పూర్తిగా వైద్య వృత్తికే జీవితాన్ని అంకితం చేశారు.
రాత్రనకా పగలనకా పని చేయడంతో.. ఖుటియా ఆరోగ్యం దెబ్బతింది. కరోనరీ యాంజీయోగ్రఫీ చేయించుకోవాలని కొద్ది నెలల క్రితమే ఆయనకు డాక్టర్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణలో ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. పేదలకు వైద్యం చేయడం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టేంతటి అంకితభావం ఆయన సొంతమని తోటి డాక్టర్లు ఖుటియా కొనియాడారు.